కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపిన రేణుకస్వామి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు గురువారం ఉదయం నటుడు దర్శన్‌ తూగుదీపకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే, బెంగళూరు పోలీసులు వేగంగా కదిలి ఆయనను అరెస్టు చేశారు. దర్శన్‌తో పాటు అతని స్నేహితురాలు, నటి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచి, ట్రయల్‌ కోసం జైలుకు తరలించనున్నారు.

రేణుకస్వామి హత్య కేసులో దర్శన్‌కు బెయిల్‌ ఇవ్వడంపై కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, దర్శన్‌తో పాటు మరో ఆరుగురు నిందితుల బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదే కేసులో సహనిందితులు ప్రదూష్‌, లక్ష్మణ్‌ ఎం, నాగరాజు ఆర్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుకుమార్‌, జగదీష్‌ల అరెస్టు కూడా సమీపంలోనే ఉండొచ్చని సమాచారం. దర్శన్‌ను బళ్లారి సెంట్రల్‌ జైలుకు తరలించే అవకాశముంది. ఇదివరకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో అతను పొగ తాగుతూ, పేరుమోసిన నేరస్తులతో తిరుగుతున్న ఫోటోలు బయటకు రావడం పెద్ద చర్చకు దారితీసింది.

గతేడాది జూన్‌లో చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి, దర్శన్‌ అభిమాని, హత్యకు గురైన ఘటన కర్నాటక అంతటా ప్రకంపనలు రేపింది. ఆ కేసులో దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొదట కర్నాటక హైకోర్టు అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్, డిసెంబర్‌లో రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. కానీ కర్నాటక సర్కారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసి, ఏడుగురి బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది.

చివరికి సుప్రీంకోర్టు అదే చేస్తూ, నటుడు దర్శన్‌ — హీరోయిన్‌ పవిత్ర గౌడ అరెస్టుతో ఈ హత్య కేసు మళ్లీ వార్తల కేంద్రంగా మారింది.

You may also like
Latest Posts from